మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (16:17 IST)

నా ఇంటిని కూల్చివేస్తే ఏం చేద్దాం : నేతలతో చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎపుడూ లేని కష్టమొచ్చింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నగరాన్ని వీడి విజయవాడకు సమీపంలోని ఉండవల్లి గ్రామంలో కృష్ణానది కరకట్టపై ఓ ఇంటిని నిర్మించుకుని తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. 
 
అయితే, కరకట్టపై నిర్మితమైన అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, కరకట్టపై గత ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని రెవెన్యూ సిబ్బంది బుధవారం ఉదయానికంతా కూల్చివేశారు. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నివాసంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు అనేక మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ, ఒకవేళ ప్రభుత్వం అక్రమ నిర్మాణం కింద తాను ఉండే ఇంటిని కూడా కూల్చివేస్తే ఏం చేయాలన్ని అంశంపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా, కరకట్టపై మొత్తం 60 అక్రమ కట్టడాలు ఉన్నాయని పేర్కొంటూ ఆ భవన యజమానులకు రెవెన్యూ యంత్రాంగం నోటీసులు కూడా ఇచ్చింది. 
 
ఇలాంటి అక్రమ నిర్మాణాల్లో చంద్రబాబు నివాసం కూడా ఉంది. వైకాపా ప్రభుతం తన ఇంటిని కూడా అక్రమ నిర్మాణం కింద కలిపి కూల్చివేస్తే ఏం చేద్ధాం, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. 
 
ముఖ్యంగా, చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణమేనంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ వంటివారు వ్యాఖ్యానించారు. పైగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్వయంగా ఇంటిని ఖాళీ చేయాలని వారు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసాన్ని కూడా కూల్చివేసే అవకాశాలు లేకపోలేదు. అందుకే పార్టీ నేతలతో చంద్రబాబు తన నివాసంలో కీలక భేటీ నిర్వహించినట్టు తెలుస్తోంది.