1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 మే 2021 (16:42 IST)

ఆనందయ్య కరోనా మందు.. బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు..

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే ఈ కరోనా మందుపై కొందరు బ్లాక్ మార్కెట్ రాయుళ్లు పడ్డారు. 
 
ప్రస్తుతం ఒక వారం పదిరోజుల పాటూ కరోనాకు ఆనందయ్య మందు దొరకడం లేదు. దీంతో ఆ కరోనా మందు తమ దగ్గర ఉంది అంటూ పలువురు అమ్మకాలు మొదలుపెట్టారు. అది నిజమో.. కాదో కూడా తెలియని పరిస్థితి. 
 
కొందరు నిజమైన మందేమో అనుకుని కొనేస్తూ ఉన్నారు. ఏకంగా 3000 రూపాయల నుండి 10వేల రూపాయల వరకూ ఆనందయ్య కరోనా మందు అంటూ అమ్మకాలు మొదలుపెట్టేశారు. చాలామంది కొంటున్నారు.
 
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి కొద్దిరోజుల పాటు బ్రేక్‌ పడింది. కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. 
 
శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని.. మందు కోసం ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు.
 
ఆనందయ్య మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా, ఇవాళ ఐసీఎంఆర్ టీమ్‌తో కలిసి మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఐసీఎంఆర్ బృందం కరోనా ఆయుర్వేద మందుగా ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. 
 
తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందులో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయాన్ని ఐసీఎంఆర్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.