శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (13:41 IST)

ఎవరూ పిల్లనివ్వడం లేదనీ బ్యాంకు ఉద్యోగి సూసైడ్

ఇపుడు అబ్బాయిలకు పెళ్లిళ్లుకావడం చాలా గగనంగా మారింది. అమ్మాయి ఉన్న తల్లిదండ్రులు.. తమ కుమార్తెను భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగి లేదా ఏదేని మంచి ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే వారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో అనేక మంది అబ్బాయిలు ముదురు బ్యాచిలర్స్‌గా మిగిలిపోతున్నారు. 
 
తాజాగా ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేందుకు ఏ ఒక్కరూ పిల్లనివ్వడం లేదన్న బాధతతో ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా నగర శివారు ప్రాంతమైన రుద్రంపేటకు చెందిన ఉప్పలపాటి నందకుమార్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఇతని వయసు 35 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు వస్తున్నా కుదరడం లేదు. ఏదో ఒక వంకతో అమ్మాయిలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రాలేదు. ఇది ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. 
 
ఈ పరిస్థితుల్లో నాలుగు రోజుల క్రితం రుద్రంపేటలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తల్లిదండ్రులతో పాటు ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన నందకుమార్‌ సోమవారం రాత్రి విషం తాగి చనిపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి వచ్చాక కొడుకు ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.