గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (13:12 IST)

భవనాలకు వైకాపా రంగులపై ఏపీ సర్కారు జీవో రద్దు.. హైకోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు అధికార వైకాపా జెండా రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు రంగులను చెరిపేసి, కొత్త రంగులు వేయాల్సిందిగా ఆదేశించింది. అయితే, జెండా రంగులనే ఉంచుతూ, అదనంగా మట్టి రంగును వేశారు. ఇందుకోసం ఓ జీవోను ప్రభుత్వం జారీచేసింది.
 
ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం మరో రంగును అదనంగా వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారించింది. 
 
ఆఫీసులకు వేస్తున్న కొత్త రంగులు కూడా పార్టీ రంగులను పోలి ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని  ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు. సర్కారు వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్‌, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 
 
ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని వివరించింది. ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం జగన్ సర్కారుకు న్యాయస్థానాల్లో పదేపదే ఎదురు దెబ్బలు తగుతున్న విషయం తెల్సిందే.