శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:43 IST)

మంచి చేయమని అల్లాను ముస్లిం సోదరులు ప్రార్థించాలి : వైఎస్.జగన్

ప్రస్తుతం రంజాన్ నెల ప్రారంభమైందని, రాష్ట్రాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోందని ఈ రాష్ట్రాన్ని అల్లానే కాపాడాలని ముస్లిం సోదరులు ప్రార్థించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రం అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజా రవాణా సౌకర్యాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. 
 
గ్రీన్‌జోన్‌లో వ్యవసాయ పనులు, పరిశ్రమలు యధావిధిగా సాగుతాయన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పాటుపడుతున్న గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 
 
ముఖ్యంగా, రంజాన్ మాసం ప్రారంభమైందని, ముస్లిం సోదరులు తమ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవడం మంచి విషయమన్నారు. రాష్ట్రానికి మంచి చేయమని 'అల్లా'ను ప్రార్థించమని ముస్లిం సోదరులను కోరుతున్నానని, అదే విధంగా, హిందూ, క్రైస్తవ సోదరులను కూడా ప్రార్థించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
 
అంతేకాకుండా, దేశంలో అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ఇప్పటివరకు 74,551 టెస్టులు చేశామన్నారు. రాష్ట్రంలో రెడ్‌జోన్‌లో 63, ఆరెంజ్ జోన్‌లో 54, గ్రీన్ జోన్‌లో 559 మండలాలు ఉన్నట్టు వివరించారు. 
 
రెడ్, ఆరెంజ్ జోన్లలో చేసిన 70 శాతం పరీక్షల్లో 1.61 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 5 కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు.