శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (19:02 IST)

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ - ఏపీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూల వెసులుబాటును కల్పించారు. రాష్ట్రాన్ని కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో మానవవనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. 
 
విజయవాడలో ఉన్న కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోస్టు గ్రాడ్యుయేట్లు, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇంటర్న్‌షిప్ ప్రకటన విడుదల చేసింది. 
 
కరోనా సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది. దరఖాస్తులకు ఈ నెల 22 తుది గడువు.
 
విజయవాడ ఎంజీ రోడ్‌లోని న్యూ ఆర్ అండ్ బి బిల్డింగ్‌లో ఉన్న స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఉద్యోగార్థులు నేరుగా రావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ అవసరం.
 
ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు మూడ్నెళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.6 వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. ఇంటర్న్ షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసినవారికి ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. 
 
వయోపరిమితిని తగ్గించలేరు... 
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని తగ్గిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించారు. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని మార్చడంలేదంటూ స్పష్టం చేశారు. ఇదంతా దుష్ప్రచారమనీ, వయోపరిమితి అంశంలో ఎలాంటి చర్యలు ఉండబోవని వివరించారు. 
 
దీనిపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని సీఎంఓ హెచ్చరించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికస్థితిని దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిపై కసరత్తు జరుగుతోందంటూ వార్తలు రావడంతో సీఎంఓ పైవిధంగా వివరణ ఇచ్చింది.