గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (11:07 IST)

చంద్రన్న కానుక పంపిణీకి ఏపీ సర్కారు యత్నాలు!!

chandranna thofa
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టి అందిస్తూ వచ్చిన చంద్రన్న కానుకల పథకాన్ని మళ్లీ పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.538 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది. అయితే, గత వైకాపా ప్రభుత్వంలో ఈ పథకాలను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఇపుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఈ పథాన్ని పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు ప్రారంభించింది.
 
సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ.2,690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద అరకేజీ కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, రూ.100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు.
 
అయితే, రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమపిండి, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే, రెగ్యులర్ కోటా కింద రేషన్కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని కేవలం తెల్ల రేషన్ కార్డు దారులకు మాత్రమే పంపిణీ చేయనుంది.