1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (14:59 IST)

గ్రామ సచివాలయాలు : జీవో నంబరు 2ను సస్పెడ్ చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో దెబ్బలపై దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక విషయాల్లో కోర్టులతో అక్షింతలు వేయించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు తాజాగా మరోమారు కోర్టులో చుక్కెదురైంది. 
 
ఏపీలో అధికార మార్పిడి చోటుచేసుకుంది. దీంతో వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పనిలోపనిగా గ్రామ పంచాయతీల అధికారాలను గ్రామ సచివాలయాలకు బదలాయిస్తూ గతంలో ఏపీ సర్కారు నిర్ణయించడం విమర్శలపాలైంది. 
 
సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్ఓల అధికారాలు బదిలీ అంశంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ని సస్పెండ్ చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
 
గతంలోనూ హైకోర్టు ఈ అంశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఉండగా, సచివాలయాల పేరుతో మరొక వ్యవస్థ ఎందుకని ప్రశ్నించింది. రాష్ట్రంలో సమాంతర వ్యవస్థల అవసరమేంటని నిలదీసింది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇపుడు కోర్టు అక్షింతలతో పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదు.