మెరుపులు, పిడుగులపై హెచ్చరికలు... వజ్రపథ్ యాప్ ఆవిష్కరించిన బాబు
అమరావతి: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఇస్రో ఓ యాప్ను రూపొందించింది. వజ్రపథ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆవి
అమరావతి: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఇస్రో ఓ యాప్ను రూపొందించింది. వజ్రపథ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండి శేషగిరిబాబు, కుప్పం యూనివర్శిటీ ఉపకులపతి, బిఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.
వజ్రపథ్ యాప్ను ఉపయోగించి.. ప్రజలు తమ నివాస ప్రాంతంలో ఏర్పడే మెరుపులు, పిడుగులకు సంబంధించిన వాస్తవిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ యాప్ను ఉపయోగించే వారి మొబైల్లో మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని 1) ఎరుపు వలయం, 2) ఆరెంజ్ వలయం, 3) పసుపు వలయం అనే మూడు కేంద్రీకృత వృత్తాల ద్వారా తెలియజేస్తుందని వివరించారు.
ఎరుపు వలయం : ఈ యాప్ను ఉపయోగిస్తున్న వారి చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఎరుపు వలయం విస్తరించి ఉంటుంది. ఇది డేంజర్ జోన్గా గమనించాలి.
ఆరెంజ్ వలయం: పిడుగు సూచిక ఆరెంజ్ వలయంలో ఉంటే.. యాప్ను ఉపయోగిస్తున్న వారి చుట్టూ 8 నుంచి 15 కిలోమీటర్ల వ్యాసార్ధంలో మధ్యస్థ ప్రమాదకర ప్రాంతంగా గుర్తించాలి.
పసుపు వలయం : పిడుగు సూచిక పసుపు వలయంలో ఉంటే.. మొబైల్ వినియోగదారుడు 15 నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్ధంలో తక్కువ ప్రమాదాలకు అవగాశం ఉన్న ప్రాంతంలో ఉన్నట్టు.
ఈ మూడూ కాకుండా నీలం రంగు వలయం కనిపిస్తే.. మెరుపులు, పిడుగులు పడే ప్రాంతానికి దూరంగా.. సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించాలి.
వీఆర్వోలదే బాధ్యత :
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సంభవించే ఉరుములు, మెరుపులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ.. ప్రజలను హెచ్చరించాల్సిన బాధ్యతను ప్రభుత్వం వీఆర్వోలకు అప్పగించింది. మొదట సంక్షిప్త సందేశాల (ఎస్.ఎం.ఎస్) రూపంలో వచ్చే సందేశాలను.. వీఆర్వోలు ప్రజలకు తెలియజేసి వారిని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులపై అధ్యయనం, ప్రజలను అప్రమత్తం చేసే అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో ఓ ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.
బిఎస్ఎన్ఎల్ ఇంగ్లీష్, తెలుగులో ఎస్ఎంఎస్ :
మరోవైపు మెరుపులు, పిడుగులు పడే సమాచారంతో పాటు, భూకంపాలు, వరదలు, తుఫానుల సమయంలో కూడా ప్రజలకు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారం అందించేందుకు బిఎస్ఎన్ఎల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయమై బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సుమారు 30 నిముషాలు ముందుగా ఇంగ్లీషు, తెలుగు భాషలలో సమాచారం అందించడానికి తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు.