శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (21:12 IST)

ఏపీలో మరో కొత్త కారిడార్ : మంత్రి మేకపాటి

ఎన్ఐసీడీఐటీ ద్వారా హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తామని పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ద్వారా మరో కొత్త కారిడార్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం, చిత్తూరు జిల్లాలోని రౌతుసురుమల నోడ్స్ ద్వారా 'హెచ్ బీఐసీ' కారిడార్ అభివృద్ధి కానుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని 11వ అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

తాజా కారిడార్ తో కలిపి రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటై పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టనుందని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పరిశ్రమలకు పుష్కలంగా నీటి సరఫరా (బల్క్ వాటర్ సప్లై) అందజేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సామర్లకోట-రాజానగరం రహదారి పనులపైనా మంత్రి ఆరా తీశారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ క్లస్టర్ లో   కామన్ ఎఫ్ల్యుయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (పరిశ్రమలకు కావలసిన నీటిని నిల్వ చేసుకునే ప్లాంట్) పనుల పురోగతిపై మంత్రి చర్చించారు.

పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో  మరింత వేగం పెంచాలని మంత్రి మేకపాటి పరిశ్రమల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.  మంత్రి మేకపాటి అధ్యక్షతన  మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ , జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు
 
తిరుపతిలో ఐ.టీ పార్కు కు ముందుకొచ్చిన 'కపిల్' సంస్థ 
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశమై *'వాక్ టు వాక్ కాన్సెప్ట్'తో తిరుపతిలో ఐ.టీ పార్కు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి తమ ప్రతిపాదన అందజేశారు.

ఐ.టీ పార్కు ఏర్పాటు చేయడానికి సుమారు రూ.500 కోట్ల విలువైన పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని కపిల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.  అందుకు భూ కేటాయింపులలో సహకారం అందించాలని  మంత్రిని కోరారు. ఆ ఐ.టీ పార్కు ఏర్పాటు చేయడానికి 25 ఎకరాల భూమి అవసరమని భూ కేటాయింపుకు సహకరించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.

సుమారు 6వేల నుంచి 8వేల మందికి ఉద్యోగాలందించనున్న ఐ.టీ పార్కు రెండు దశల్లో ఏడేళ్లలో నిర్మిస్తామని 'కపిల్' వైస్ ప్రెసిడెంట్ మంత్రికి వివరించారు. కపిల్ సంస్థ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించి చెబుతామని బదులిచ్చారు.