గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మన్యంలో ఆంత్రాక్స్ గుబులు.. ఏడుగురు చిన్నారుల్లో లక్షణాలు

Anthrax
ఏపీలోని ఏజెన్సీ మన్యం ప్రాంతాల్లో ఆంత్రాక్స్ గుబులు మొదలైంది. ముఖ్యంగా, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ ఏజెన్సీ ప్రాంతంలో పలువురు చిన్నారులు ఈ వైరస్ బారినపడ్డారు. ఆంత్రాక్స్ వ్యాధి సోకిన చనిపోయిన మేక మాంసాన్ని ఆరగించిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు.
 
ఈ వ్యాధి బారినపడిన ఏడుగురు చిన్నారులు 5 నుంచి 13 ఏళ్లలోపు వారేనని వారు తెలిపారు. ఈ వైరస్ సోకిన చిన్నారుల చిన్నారుల శరీరంపై పొక్కులు, కురుపులు వచ్చినట్టు చెప్పారు. ఇక్కడ చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని, వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని వైద్యులు వివరించారు. 
 
గతంలో కూడా పాడేరు డివిజన్‌లో ఆంత్రాక్స్ కేసులు వెలుగు చూసిన విషయం తెల్సిందే. 2009లో 12 అనుమానిత కేసులను గుర్తించగా 76 మందికి ఆంత్రాక్స్ సోకినట్టు నిర్ధారణ అయింది. వారిలో ముగ్గురు మరణించారు. 
 
ఆ తర్వాత మళ్లీ 2013లో ఇద్దరు, 2015లో ఆరుగురిలో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించినా వ్యాధి నిర్ధారణ కాలేదు. అయితే, ఆ తర్వాత 2016లో 38 కేసులు నమోదు కాగా 10 మంది, 2017లో 21 కేసులు వెలుగు చూడగా 14 మంది, 2018లో 18 కేసుల్లో ఒక్కరు ఈ వ్యాధి బారినపడ్డారు.