1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (13:20 IST)

అమరావతిలోనే ఏపీ హైకోర్టు? అందుకే రూ.25 కోట్ల‌తో టెండ‌ర్!

ఏపీలో మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ మారుతోందా? ప‌రిపాల‌నా రాజ‌ధాని సంగ‌తి ఎలా ఉన్నా...ముఖ్యంగా హైకోర్టు అమ‌రావ‌తిలోనే కొన‌సాగ‌నుందా? అమ‌రావ‌తిలో 25 కోట్ల‌తో అద‌న‌పు హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి టెండ‌ర్లు పిల‌వడాన్ని చూస్తే, ఇది నిజ‌మే అనిపిస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తీసుకున్న ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని సీఎం జగన్ 2019 డిసెంబర్ లో జరిగిన శీతాకాల శాసనసభ సమావేశాల చివరి రోజున ప్రకటించారు.

ఇందులో భాగంగానే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ ప్రకటనపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినప్పటికీ... అధికార పార్టీ నేతలు మాత్రం సంబరాలు జరుపుకున్నారు. అటు ఇదే అంశంపై న్యాయస్థానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి. ఇక రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ 600 రోజులు పైగా రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు... అధికారులు కూడా పలు మార్లు స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ నగరం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని కూడా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగానే ఉంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్... తన ప్రసంగంలో 3 రాజధానుల గురించి కనీసం ప్రస్తావించలేదు.

ఇప్పుడు హైకోర్టు నిర్మాణం విషయంలో అమరావతి మెట్రో రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అమరావతిలోని నేలపాడులో హైకోర్టు శాశ్వత భవనం నిర్మించేందుకు ఏఎంఆర్డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 29 కోట్ల రూపాయలతో 3 అంతస్థుల భవనం నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించింది.

అయితే పునాదులు మాత్రం 5 అంతస్తుల భవనానికి అనుగుణంగా ఉండేలా నిర్మించాలని సూచించారు. న్యాయ రాజధానిగా కర్నూలు నగరం ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం... అమరావతిలోని నేలపాడులో శాశ్వత హైకోర్టు భవనం నిర్మించేందుకు టెండర్లు పిలవడం సర్వత్రా ఆసక్తిగా మారింది.