1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:58 IST)

పోలీస్ సిబ్బంది సంక్షేమం...బాధిత కుటుంబానికి రూ. 50 ల‌క్ష‌ల ప్యాకేజీ!

ప్రజా రక్షణలో అత్యంత కీలకం పోలీసు శాఖ. ఆ శాఖలోని   సిబ్బంది ఎల్లవేళలా అత్యంత కఠినమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో తమ విధులు నిర్వహిస్తుంటారు. సాదారణ విధులకు తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి పైన  జరిగిన మహా యుద్దంలో  ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క పోలీస్ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప‌నిచేస్తుంటారు. స‌మాజ సేవే పరామావ‌ధిగా విధులు నిర్వహించి, రాష్ట్ర ప్రజల మన్నలను పొందడమే కాకుండా విధి నిర్వహణలో  దేశం లోని వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. కోవిడ్ మహామరితో జరిగిన పోరాటంలో విధులు  నిర్వహిస్తున్న  200 మందికి పైగా సిబ్బంది ప్రజా సేవలో వీరమరణం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కు అందిస్తున్న ప్రోత్సాహం, సహాయ సహకారాలు తోపాటు గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో అపత్ సమయంలో ప్రత్యేక్షంగా ప్రజాలకు సేవ చేసే అవకాశం పోలీసు శాఖకు మాత్రమే దక్కిన అదృష్టంగా బావిస్తున్నామ‌ని ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ చెప్పారు.  
 
విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబ సభ్యులకు చెక్కులను డీజీపీ అందించారు. ఇటీవల విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరో బెటాలియన్ కు  చెందిన కానిస్టేబుల్ శివ నాగరాజు కుటుంబానికి యాభై లక్షల రూపాయల చెక్కు, విశాఖపట్నం కు చెందిన కానిస్టేబుల్ సూర్యనారాయణ  కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సి డెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా లభించిన 20 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రజాసేవలో నిరంతరం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల  సంక్షేమంపై  గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ శాఖలో సంక్షేమ పరంగా క్షేత్ర స్థాయి సిబ్బందికి లబ్ధి పొందేవిధంగా నూతన సంక్షేమ పాలసీని  అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌న్నారు. 
 
ఎపి పోలీసు, భద్రతా పథకంలో భాగంగా అందుబాటులోకి తీసుకొని వచ్చిన నూతన సంక్షేమ పాలసీ వివరాలివి. పోలీశాఖలోని అన్ని విభాగాలు జిల్లా కేంద్రాల్లో ప్రతి శుక్రవారం సిబ్బంది కోసం ప్రత్యేకంగా  పోలీస్ వెల్ఫేర్ డే గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నూతన పాలసీలో భాగంగా ఋణాల లబ్ధి, ఋణాల వడ్డీ శాతం తగ్గింపు, ఋణాలు తిరిగి చెల్లించే కాలపరిమితిని పెంచారు. అలాగే వ్యక్తిగత, వాహనాలు, వివాహం, విద్య, గృహనిర్మాణం, గృహ స్థలాలు, విదేశీ చదువులుపై పొందే ఋణాల పరిమితిని భారీగా పెంచారు. వివిధ బ్యాంకుల‌తో చర్చించిన అనంతరం ప్రస్తుతం ఉన్నవడ్డీ శాతం వివిధ విభాగాల్లో సుమారు 2.5% నుండి 4% శాతాన్ని తగ్గిస్తూ. నూతన  పాలసీలను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. 
 
ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ, సిబ్బంది వారి కుటుంబం సభ్యుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా అమలులోకి తీసుకు వచ్చామ‌న్నారు. ఈ నూతన సంక్షేమ పాలసీ ఫలాలను పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి సిబ్బందికి చేరే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.