1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (20:09 IST)

ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇక లేనట్లేనా?

మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు గానీ, గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించేందుకు గానీ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేదిలేదని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నది.
 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఉన్నంత కాలం ఎన్నికల నిర్వహణ జరిపేది లేదని విస్పష్టంగా తన నిర్ణయాలతో అనునిత్యం వెల్లడిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీ, ఎంపిపిల స్థానం లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది.
 
డిసెంబర్ ఆఖరునాటికి ప్రత్యేక అధికారుల పాలన పూర్తి కాగా మరో ఆరు నెలలు పాటు పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనాపరంగా ఇది అనివార్యం అయిన చర్య.
 
అయితే మధ్యలో నిలిచిపోయిన ఎన్నికలు నిర్వహించే పని ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా ఈ విధంగా ప్రత్యేక అధికారుల పాలన పొడిగించడం గమనార్హం. మండల పరిషత్ లో జూలై 3, జిల్లా పరిషత్ లో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది.
 
ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికి డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ పదవి కాలం పూర్తి అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.