హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్తో భవానీ వార్డ్ 1997 చిత్రాన్ని జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్లో.. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, భవానీ వార్డ్ 1997 ఈ మూవీ టైటిల్ పోస్టర్ను నేనే లాంఛ్ చేశారు. సాయి సతీష్ పిలవడం వల్లే నేను ఇక్కడకు వచ్చాను. సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుంటే టీంకు ఓ టెన్షన్ ఉంటుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశారు. అది వీళ్ల మాటల్లోనే అర్థం అవుతోంది. ఇక ఆడియెన్స్ ఇచ్చే రిజల్ట్ కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. వీళ్ల టెన్షన్ పోగొట్టేందుకు, మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చాను. కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. నాకు హారర్ చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు మీడియా సపోర్ట్ ఇవ్వాలి. ఫిబ్రవరి 7వ తేదీన రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి అని అన్నారు.
దర్శకుడు జి.డి. నరసింహా మాట్లాడుతూ, మా సినిమా ఈవెంట్కు వచ్చి సపోర్ట్ చేసిన రాజ్ కందుకూరికి థాంక్స్. సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు మాకోసం వచ్చి సపోర్ట్ చేశారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సాయి సతీష్కి థాంక్స్. మా సినిమాలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. గణేష్, పూజా కేంద్రే ఇలా అన్ని పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ మీ అందరినీ భయపెట్టేలా ఉంటుంది. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అదే రోజున 'తండేల్' కూడా రాబోతోంది. అన్ని సినిమాలు చూసి సపోర్ట్ చేయండి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారందరికీ మా భవానీ వార్డ్ 1997 నచ్చుతుంది అని అన్నారు.
గణేష్ రెడ్డి మాట్లాడుతూ, మా ఈవెంట్కు వచ్చిన రాజ్ కందుకూరికి థాంక్స్. సీరియల్స్ నుంచి సినిమాకి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. మేం పడ్డ కష్టాన్ని ఎవ్వరూ చూడరు. అందరూ అవుట్ పుట్నే చూస్తారు. ఈ సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వదినమ్మ సీరియల్లో నాని పాత్రతో అందరూ నన్ను గుర్తు పడతారు. నన్ను మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న సాయి సతీష్కి థాంక్స్. జి.డి. నరసింహ నాకు దర్శకుడిగా మాత్రమే కాకుండా సొంత బ్రదర్లా మారిపోయారు. పూజా కేంద్రే అద్భుతంగా నటించింది. మా చిత్రం ఫిబ్రవరి 7న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.
పూజా కేంద్రే మాట్లాడుతూ, మా ఈవెంట్కు వచ్చిన రాజ్ కందుకూరికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. పూర్తి హారర్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం ఉంటుంది. ప్రతీ సీన్ చాలా ఇంపార్టెంట్. ఈ చిత్రంతో నేనేంటో ఆడియెన్స్ అందరికీ తెలుస్తుంది. మా టీంను అందరూ సపోర్ట్ చేయండి అని అన్నారు.
పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ, రేవు సినిమా తర్వాత ఈ చిత్రాన్ని చూశాను. దర్శకుడు చాలా తక్కువగా మాట్లాడతాడు. కానీ ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. మా సాయి సతీష్ అద్భుతంగా నటించాడు. ఇకపై ఆర్టిస్ట్గా బిజీ అవుతాడేమో అని అనిపిస్తోంది అని అన్నారు.
సాయి సతీష్ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో రాజ్ కందుకూరి నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. మా పర్వతనేని రాంబాబు అన్న నాకు బ్యాక్ బోన్లా వెన్నంటే ఉంటారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు జీడీ నరసింహకు థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నిస్సి జస్టిన్ మాట్లాడుతూ, భవానీ వార్డ్ 1997 సినిమాను నాకు ఇచ్చిన దర్శకుడు జీడీ నరసింహకి థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఫిబ్రవరి 7న మా సినిమాను చూసి సక్సెస్ చేయండి అని అన్నారు.
కెమెరామెన్ అరవింద్ మాట్లాడుతూ, భవానీ వార్డ్ 1997 సినిమాకు ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా చివరకు సినిమాను ఫినిష్ చేశాం. ఫిబ్రవరి 7న ఈ మూవీని ఆడియెన్స్ మందుకు తీసుకు రాబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్గా నిలిచిన దర్శక, నిర్మాతలకు, ఆర్టిస్టులకు థాంక్స్ అని అన్నారు.