1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (10:38 IST)

అసని తుఫాను.. విశాఖకు రావాల్సిన విమానాలు రద్దు.. దారి మళ్లింపు

flights
'అసని' తీవ్ర తుపాను ప్రభావంతో ఏర్పడిన గాలుల తీవ్రత కారణంగా విశాఖపట్నం రావాల్సిన పలు విమానాల్ని రద్దు చేశారు. మరికొన్ని విమానాల్ని దారి మళ్లించారు. 
 
విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, ఏడు విమానాలను మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 
 
తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశాపై ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
ట్రాక్‌లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. ఒడిశా వైపు వెళ్లే మూడు రైళ్లని దారి మళ్లించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై.. కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
 
తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకూ మండలస్థాయి అధికారులు, సిబ్బంది హెడ్‌ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 
 
మరోవైపు భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌షిప్‌ ఐసీజీఎస్‌ వీరా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. 20 మంది కోస్ట్‌ గార్డు సిబ్బందితో పాటు 5 విపత్తు సహాయ బృందాలు సహాయక సామగ్రితో సన్నద్ధంగా ఉన్నాయి.
 
మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుపోయారేమోనన్న అనుమానాలతో కోస్ట్‌గార్డు, నౌకాదళ బృందాలు బంగాళాఖాతాన్ని జల్లెడ పట్టాయి. 
 
విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.