1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (19:38 IST)

ఆనందయ్య మందుతో స్వస్థత చేకూరిందని చెబుతున్నారు... : రాములు

కరోనా వైరస్ రోగులకు కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుతో స్వస్థత చేకూరిందని చాలామంది చెబుతున్నారని ఆయుష్ రాష్ట్ర కమిషనర్ రాములు నాయక్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆనందయ్య ఔషధంలో వాడుతున్న మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనన్నారు. ఇందులో హానికరమైన పదార్థాలేవీ లేవని స్పష్టం చేశారు. 
 
అయితే, ఏ విధానంలో ఎంత మోతాదులో మందు తయారుచేస్తున్నారో తెలియాల్సివుందన్నారు. ఇప్పటికే మందులో వాడిన 18 రకాల మూలికలపై అధ్యయనం చేశామన్నారు. మందుపై ఐదారు రోజుల్లో నిపుణుల నివేదిక వస్తుందని, నివేదిక పరిశీలించాక ఆనందయ్య ఔషధం కరోనా కట్టడికి పనికి వస్తుందో, లేదో నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. 
 
అయితే, ఈ ఔషధంతో స్వస్థత చేకూరిందని ఎక్కువమంది చెబుతున్నారని రాములు వివరించారు. అయితే, దీన్ని చట్టపరంగా మాత్రం ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమన్నారు. క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమని స్పష్టం చేశారు. ఆనందయ్య మందును తాము ఎక్కువ చేసి చెప్పడం లేదని, అలాగని కించపరచడం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆనందయ్య ఔషధం గురించి సీఎం జగన్ తో చర్చించామని, పరిశోధన త్వరగా పూర్తిచేయాలని చెప్పారని వెల్లడించారు.
 
ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే ప్రజలకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. సీసీఆర్ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆనందయ్య మందును ఇప్పటివరకు 80 వేల మందికి పంపిణీ చేసినట్టుచెబుతున్నారని, వేల మందిలో ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, ఇదేమంత పెద్ద విషయం కాదని రాములు నాయక్ వెల్లడించారు.