1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 30 అక్టోబరు 2021 (16:33 IST)

చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌ల‌తో ముగిసిన బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌

బ‌ద్వేల్ ఉప ఎన్నిక పార్టీల మ‌ధ్య చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌ల‌తో ముగిసింది. పోలీసులు వైసీపీకి స‌హ‌కరించార‌ని బీజేపీ నేత‌లు ఇక్క‌డ ఆరోపించారు. ఒక ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు  ఫిర్యాదు చేశారు. వైసీపీకి ఎస్సై చంద్రశేఖర్ సహకరిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపిస్తూ, ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ శ్రేణులకు పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 
 
మరోవైపు బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ మాట్లాడుతూ 149, 150 పోలింగ్ బూతుల వద్ద ఎస్ఐ చంద్రశేఖర్ వైసీపీ పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బయటి ప్రాంతానికి చెందిన వందలాది మంది నిన్న రాత్రే బద్వేల్ నియోజకవర్గానికి చేరుకున్నారని అన్నారు. పోలీసుల తీరు చూస్తుంటే వారే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తున్నట్టు ఉందని మండిపడ్డారు. 
 
మరోవైపు బద్వేల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి మాట్లాడుతూ, పలు బూతుల్లో బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూర్చున్నారని ఆరోపించారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు.