1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (17:39 IST)

ఏపీలో ఒక్కో మ‌నిషిపై ల‌క్షా 20 వేల అప్పు! ఇరుక్కుపోయాంగా...

బిజెపి నాయ‌కులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైసీపీపై త‌మ వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. బీజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెండు  తీర్మానాల పై చర్చ చేశారు. రాజకీయ ముసాయిదా తీర్మానంలో  వరద రాజకీయం, దేవాలయాలపై దాడులు మతమార్పిడులు, తెలుగు భాషపై నిర్లక్ష్య భావం, రాజధాని రాజకీయం, బీసీ రాజకీయం, విద్యుత్ బిల్లులు, యువతను నిర్వీర్యం అంశాలపై చర్చ చేశారు.
 
 
రాష్ట్ర ఆర్ధిక తీర్మానంలో భాగంగా అప్పుల ఊబిలో ఆంధ్ర ప్రదేశ్, సంక్షేమం పేరుతో సంక్షోభం, అప్పుల కోసం తిప్పలు, కేంద్రం సాయం రాష్ట్రం మాయ, అనవసర విషయాలపై దృష్టి అంశాలపై చర్చ జ‌రిపారు. రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ మాట్లాడుతూ, ఎపి ప్రభుత్వం దివాళా తీసేలా అప్పులు చేస్తోంద‌ని, రాష్ట్ర విభజన స‌మ‌యంలో మనిషికి 20 వేల అప్పు ఉంటే, ప్రస్తుతం ఒక మనిషికి 1 లక్షా 20 వేల రూపాయల అప్పు ఉంద‌న్నారు. 

 
గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంది బూతుల పురాణం తప్ప అభివృద్ది లేద‌న్నారు... ఆర్ధిక సంక్షోభంలో ఎపి ప్రజలు ఇరుక్కుపోతున్నారని చెప్పారు. ప్రజలకు ఒకటే చెబుతున్నాం. బిజెపినే ఎపికి దశ దిశ అని బీజేపీ నేత‌లు చెప్పారు. 
 
 
రాజ్య స‌భ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్ధిక ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోంద‌న్నారు. ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైంద‌ని, ఎపి పరిరక్షణపై సమావేశంలో చర్చించామ‌న్నారు. వైసిపి నేరాలు, ఘోరాలతో వైసిపి కి ఓటు వేసిన వారంతా బాధపడుతున్నార‌న్నారు. ఎపి లో ప్రజాస్వామ్యం లేద‌ని, ఏ ఎన్నికలైనా అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్నార‌న్నారు. వైసీపీకి బిజెపి అండ ఉందని కొంత మంది అనుకుంటున్నార‌ని, అదంతా పుకార్లే.. అన్నారు.

 
రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ మాట్లాడుతూ, కడప  స్టీల్ ప్లాంటుకు సిఎం శంకుస్థాపన చేసి రెండేళ్లయింద‌ని, అక్కడ ఎటువంటి నిర్మాణం లేద‌న్నారు. ఎపి లో ఇసుక, మద్యం, గంజాయి స‌మ‌స్య‌ల‌తోపాటు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింద‌న్నారు. కేంద్ర మంత్రి షెకావత్ పార్లమెంట్ లో ఉన్న విషయం చెప్పార‌ని, ఆయ‌న‌పైనా ఎస్ సి, ఎస్ టి కేసు పెడతారా అని ప్ర‌శ్నించారు. ఆ భయానక పరిస్ధితులకు పోలీసులే కారణమ‌ని, ప్రభుత్వం చెప్పిందల్లా చేస్తున్నార‌న్నారు. కేంద్రానికి సమస్యల మీద ఎవరైనా వస్తారు.... కాని మంత్రులు డీల్లీకి వచ్చేది అప్పులు అడగడానికి అని ఎద్దేవా చేశారు. 
 
 
ఎంపి జివిఎల్ నరసింహా రావు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి షెకావత్ డ్యాం పై పూర్తి ఆధారాలతో బయటపెట్టార‌ని, దీనిపైనా రాజకీయం అనడం సిగ్గుచేట‌న్నారు. ముఖ్యమంత్రి వాళ్ల ఎంపిలకు చెప్పి వారించాలి...లేకపోతే ఇబ్బందులు తప్పవు అని హెచ్చ‌రించారు.