1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (08:23 IST)

భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో పరారైన సాయిప్రియపై కేసు

saipriya
గత నెల 22వ తేదీన తన భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లి సాయిప్రియ అక్కడ తన భర్తకు మస్కా కొట్టించి ప్రియుడితో లేచిపోయింది. ఆమె కోసం గాలించేందుకు పోలీసులు భారీగానే ఖర్చు చేశారు. చివరకు ఆమె తన ప్రియుడితో బెంగుళూరులో ఉన్నట్టు గుర్తించారు. అయితే, అటు కుటుంబ సభ్యులతో పాటు అటు పోలీసులను మోసం చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతితో సాయిప్రియతో పాటు.. ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వైజాగ్, ఎన్‌ఏడీ సమీపంలోని సంజీవయ్య నగర్‌కు చెందిన సాయిప్రియ - శ్రీనివాసరావు అనే దంపతులు ఉన్నారు. శ్రీనివాస రావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, జులై 22న పెళ్లి రోజును జరుపుకునేందుకు విశాఖ వచ్చాడు. 
 
ఆ రోజు సాయంత్రం భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆపై ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. 
 
ఆయన పక్కకు వెళ్లి మాట్లాడుతుండగా ఇదే అదునుగా భావించిన సాయిప్రియ క్షణాల్లోనే మాయమైంది. భార్య కనిపించకపోవడంతో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్ సాయంతో గాలించారు. 
 
ఇందుకోసం అధికారులు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. అయితే, ఆ తర్వాత ఆమె బెంగళూరులో ఉన్న ప్రియుడి వద్దకు చేరుకున్నట్టు తెలియడంతో కథ సుఖాంతం అయింది. 
 
తాజాగా, ఈ కేసులో వైజాగ్ పోలీసులు కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ప్రియుడితో పరారైన సాయిప్రియ అందరినీ తప్పుదోవ పట్టించిందని, ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసిందని వారిపై అభియోగాలు నమోదయ్యాయి.