వివేకా హత్య కేసులో కీలక పరిణామం : దస్తగిరి నిందితుడు కాదు.. ఓ సాక్షి మాత్రమే...
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు జాబితాను సీబీఐ కోర్టు సవరించింది. ఈ హత్య కేసులోని నిందితుల్లో ఒకడిగా ఉన్న దస్తగిరి పేరును ఆ జాబితా నుంచి తొలగించి, ఈ కేసులో ఒక సాక్షిగా గుర్తించింది. ఈ కేసులో తనను ఓ సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే అప్రూవర్గా మారేందుకు కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, అందువల్ల నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో సాక్షిగా పరిగణించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సీబీఐ చార్జిషీటులోనూ తనను సాక్షిగా పేర్కొన్నారన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోని దస్తగిరి పిటిషన్లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు... వివేకా హత్య కేసు నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.