1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 27 జనవరి 2022 (17:37 IST)

విశాఖపట్నంలో ఈఎస్‌ఐ ఆసుపత్రికి రూ.390 కోట్లు మంజూరు

కేంద్రం నుంచి విశాఖపట్నం ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో 8 మంజూరైన ఇఎస్ ఐ ఆసుపత్రుల ప్రారంభ నిర్మాణానికి బడ్జెట్ ఆమోదం కోసం తాను కేంద్ర కార్మిక మంత్రి  భూపేందర్ యాదవ్‌ను సంప్రదించిన‌ట్లు రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు.
 
 
విశాఖపట్నంలో 400 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐసి), కార్మిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం రూ.390 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేసింద‌ని  జివిఎల్ నరసింహారావు తెలిపారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకుంద‌ని, సీపీడబ్ల్యూడీ ద్వారా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపడతార‌న్నారు.
 
 
జనవరి 4, 5 తేదీల్లో విశాఖపట్నం మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంతో పాటు విశాఖపట్నంలో 400 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పౌర సేవలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమీక్షించారు.
 
 
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మరో ముఖ్యమైన ప్రాజెక్టును అందించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,  కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లకు ఎంపీ జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇతర ఈఎస్‌ఐ ఆసుపత్రులను త్వరగా ఖరారు చేయడానికి  కృషి చేస్తానని ఎంపీ జీవీఎల్ తెలిపారు.