గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మహాపాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి : ఆర్ఆర్ఆర్ వినతి

raghuramakrishnam raju
అమరావతి ప్రాంత రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాశారు. 
 
నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్‌తో రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర ప్రారంభించారని, దీనికి  వైకాపా శ్రేణుల నుంచి ముప్పు పొంచివుందని అందువల్ల ఈ పాదయాత్రకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు. 
 
అమరావతి రైతులు దాదాపు వెయ్యి కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలతోపాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. పాదయాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించారని, రైతులు హైకోర్టులో పిటిషన్ వేయగా, విచారించిన న్యాయస్థానం యాత్రకు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
 
అయతే, రాజుధాని విషయంలో హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రులు మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నారని, తద్వారా కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బట్టి.. రైతుల పాదయాత్రలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ పాదయాత్రకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో భద్రత కల్పించాలని కోరారు.