1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (18:28 IST)

వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే : కోటంరెడ్డి

kotamreddy
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ అన్నా క్యాంటీన్లు తెరుచుకుంటాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తెరుచుకుంటాయన్నారు. ఒక చేత్తే పది రూపాయలు ఇచ్చి మరో చేత్తే రూ.100 లాగేస్తున్నట్టుగా వైకాపా పాలన ఉందన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదన్నారు. పెట్టేబేడా సర్దుకుని పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందన్నారు. ఏపీలో కరెంట్ షాకులు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన పనిలేదని, జగనన్న కరెంట్ బిల్లులు పట్టుకుంటే చాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 
 
ఏపీలో టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమన్నారు. ఆ మరుసటి రోజే అన్న క్యాంటీన్లు ప్రారంభంకావడం తథ్యమన్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. 
 
జగన్‌కు అన్నక్యాంటీన్ పేరు నచ్చకపోతే జగనన్న క్యాంటీన్ పేరుతో దానిని కొనసాగించాల్సిందని, కానీ ఇలా వాటిని మూసేసి పేదల కడుపు కొట్టడం సమంజసం కాదని అన్నారు. 30 ఏళ్లుగా క్వార్ట్జ్‌కు సరైన ధరలేక వ్యాపారులు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతున్న వేళ గనులను స్వాధీనం చేసుకోవడంతో వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.