శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:41 IST)

ఎన్నారై జయరామ్ అనుమానాస్పద మృతి.. ఈయనే కోస్టల్ బ్యాంకు ఫౌండర్

ఎన్నారై జయరామ్‌గా, కోస్టల్ బ్యాంకు ఛైర్మన్‌గా ప్రతి ఒక్కరికీ సుపరిచితుడైన చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కీసరకు సమీపంలో ఐతవరం గ్రామ జాతీయరహదారి పక్కన ముళ్ళ పొదల్లో ఉన్న కారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివశిస్తున్నారు. కోస్టల్ బ్యాంకు డైరెక్టర్‌గా, హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీగా జయరామ్ పనిచేస్తున్నారు. జయరామ్ కొన్ని రోజులు ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్‌గా పని చేయగా, ఈ టీవీని ఒక యేడాది క్రితం మూసివేశారు. జయరామ్ కుటుంబం అమెరికాలో నివాసం ఉంటుంది. హత్యకు ఆర్థికపరమైన వివాదాలు కారణమై ఉంటాయని పోలీసుల అనుమానిస్తున్నారు. 
 
రెండు రోజుల క్రితం జయరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో మరో వ్యక్తితో కలిసి వెళ్లినట్లు తెలిసింది. అయితే, తలపై బలమైన గాయాలు ఉండటంతో ఆయన్ను కొట్టి చంపారా లేదా ప్రమాదవశాత్తు చనిపోయారా అన్నది తెలియాల్సి వుంది. కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కనూరులో జయరామ్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ఈయనకో అమెరికాతో పాటు.. హైదరాబాద్‌లో పలు కంపెనీలు ఉన్నాయి.