1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 13 మే 2021 (18:55 IST)

కరోనా సమయంలో కరుణించిన వేంకటేశ్వరుడు, స్వామి నిధులతో కోవిడ్ షెడ్లు

కరోనా సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్ షెడ్లు నిర్మించడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ 3.52 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు ఈఓ జవహర్ రెడ్డి.
 
కోవిడ్ 19 బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్ల అందుబాటు ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. ఈ ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గించడానికి ఇటీవల తిరుపతి శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి వద్ద జర్మన్ షెడ్ నిర్మించి అందులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ షెడ్లు నిర్మించాలని టీటీడీకి విన్నపాలు వచ్చాయి. ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం మేరకు శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయోనిధి నుంచి రూ.3. 52 కోట్లు మంజూరు చేశారు.
 
ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో 4, ప్రకాశం 2, అనంతపురం 3, కృష్ణా 3, కర్నూలు 2, గుంటూరు 3, కాకినాడ 3తో పాటు ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లు నిర్మించనున్నారు. టీటీడీ ఆమోదించిన అంచనా ఖర్చు మేరకు షెడ్లు నిర్మించుకోవడానికి ఆయా జిల్లా కలెక్టర్లకు నిధులు అందించనుంది. ఒక షెడ్లో దాదాపు 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎంతగానో కోవిడ్ రోగులకు ఉపయోగపడనుందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.