శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:43 IST)

ఏపీలో 143కు చేరిన కరోనా కేసులు... జిల్లాల వారీగా...

ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నది. ఆ తర్వాత ఒక్కసారిగా విశ్వరూపం దాల్చింది. ఫలితంగా 11 కేసుల నుంచి సెంచరీ దాటిపోయింది. గురువారం రాత్రికి ఈ కేసుల సంఖ్య ఏకంగా 143కు చేరింది. దేశంలోని రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరింది. దీనికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ సమ్మేళనమే. ఈ మతప్రార్థనలకు వెళ్లివచ్చిన వారందరికీ ఈ కరోనా వైరస్ సోకింది. దీంతో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
 
కాగా, గురువారం మరికొన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో కృష్ణా జిల్లాలో ఎనిమిది, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరింది. ఈ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. కరోనా కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే, 
 
అనంతపూర్ 2, చిత్తూరు 9, ఈస్ట్ గోదావరి 9, గుంటూరు 20, కడప 13, కృష్ణా 23, కర్నూలు 1, నెల్లూరు 21, ప్రకాశం 17, శ్రీకాకుళం 0, విజయనగరం 0, వెస్ట్ గోదావరి 14, విశాఖపట్టణం 11 చొప్పున మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. మరో 403 మంది పరీక్షల రిపోర్టులు రావాల్సివుంది.