శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (16:22 IST)

జగన్ అన్న క్యాంటీన్‌ను రద్దు చేసి పేదల కడుపుకొట్టారు: మంత్రి దేవినేని

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందించేలా పట్టణ ప్రాంతాల్లోని 73 మున్సిపాలిటీలలో 203 అన్న క్యాంటీన్ లను (పట్టణ ప్రాంతాల్లో 160, గ్రామీణ ప్రాంతాల్లో 53) తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించామని దీన్ని 370 లక్ష్యంగా పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్‌లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. 
 
సోమవారం నాడు నందిగామ పట్టణంలో రైతు బజార్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్  ప్రాంతంలో మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తో కలసి వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ఉమా మాట్లాడుతూ, పేదలు కడుపునిండా భోజనం చేయటం ఇష్టం లేనట్లు ప్రభుత్వం వ్యవహరించటం దుర్మార్గమైన చర్యని, అన్న క్యాంటీన్లను మూసివేసి రాష్ట్ర ప్రభుత్వం పేదలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రోజుకు మూడు పూటలా పేదవాడు అన్న క్యాంటీన్లలో తింటే చెల్లించేది 15 రూపాయలు కాగా ప్రభుత్వం అక్షయ పాత్ర ఫౌండేషన్ కు రూ. 73 రూపాయలు సబ్సిడీగా ఇచ్చిందన్నారు. కూలిపని చేసుకునే పేదవాళ్ళు పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు కేవలం 15 రూపాయల ఖర్చుతో అన్న క్యాంటీన్లలో మూడుపూటలా కడుపునిండా భోజనం చేసే వారిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
పేదవాడికి పట్టెడన్నం పెట్టడం కన్నా రాజకీయ పరమార్ధం ఏముంటుందని సెలవిచ్చిన అన్న నందమూరి తారక రామారావు మాటలే పథకం నిర్వహణకు తారకమంత్రం అని చెప్పారు. అన్న కాంటీన్ నిర్వహణ వల్ల రూపాయి లేదంటూ రాష్ట్ర మంత్రి వ్యాఖ్యానించడం క్యాంటీన్ల నిర్వహణపైవైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అధికారంలోకి వచ్చిననాడే తెలిసిపోయింది అన్నారు.
 
క్యాంటీన్ల రంగు మార్చినంత మాత్రాన పథకం రద్దు చేసినట్లు కాదని అసెంబ్లీ వేదికగా సెలవిచ్చిన మంత్రి బొత్స పేదల ఆకలి మంటకు ఏం సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు. అన్న క్యాంటీన్ ను రద్దు చేయడం అంటే అన్నార్తుల కడుపుమంట పెట్టడమే నని ఈ క్యాంటిన్లు తిరిగి తెరిచే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం రైతు బజార్ వద్ద నుండి వార్డుల్లో ప్రజా చైతన్య యాత్ర కొనసాగిస్తూ అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.