శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:43 IST)

తాగిన మత్తులో కన్న కూతురుపైనే గొడ్డలితో దాడి...

ఎన్ని చర్యలు తీసుకున్నా మందుబాబుల ఘాతుకాలకు కళ్లెం వేయడం సాధ్యపడటం లేదు. మద్యం తాగి ఓ తండ్రి గొడ్డలితో కూతురిపై దాడి చేసాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే తుమరాడ జ్యోతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తోంది. 
 
ఇటీవల ఆమె భర్త చనిపోవడంతో ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. తన తల్లిదండ్రుల ఇల్లు కూడా సమీపంలోనే ఉంది. కానీ కొంతకాలంగా తండ్రి రామకృష్ణ మందుకు బానిసై, జ్యోతితో తరచూ గొడవపడుతుండేవాడు. యధావిధిగా మద్యం సేవించి రామకృష్ణ మంగళవారం మధ్యాహ్నం కూతురి ఇంటికి వచ్చాడు. 
 
ఆమెతో ఘర్షణ పడి గొడ్డలితో దాడి చేశాడు. బాధితురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. పొరుగువారు అక్కడికి వచ్చే సరికి రామకృష్ణ పరారయ్యాడు. బాధితురాలిని వెంటనే ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.