1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (17:23 IST)

ఎన్నికల సంఘానికి చంద్రబాబు వైరస్ సోకింది : సజ్జల రామకృష్ణారెడ్డి

sajjala ramakrishna reddy
ఎన్నికల సంఘానికి చంద్రబాబు వైరస్ సోకినట్టుగా ఉందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీలు కూటమిగా అవతరించిన తర్వాత ఎన్నికల సంఘం వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. ఈసీకి సైతం చంద్రబాబు వైరస్ సోకినట్టుగా ఉందన్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన అనుచరులు చెప్పినట్టుగానే ఈసీ అధికారులు తలాడిస్తున్నారని ఆరోపించారు. 
 
క్రీడా పోటీలో అంపైర్‌లా వ్యవహరించాల్సిన ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళుతోందని విమర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఎలా బయటికి వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మరి అదేసమయంలో టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదని నిలదీశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించేట్టయితే, రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ బయటపెట్టాలన్నారు. ఆయా ఘటనలకు ముందు, వెనుక, పోలింగ్ బూత్ పరిసరాల్లో కూడా ఏం జరిగిందో బయటికి రావాల్సిన అవసరం ఉందని సజ్జల స్పష్టం చేశారు.
 
బాధితులమని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎందుకు రీపోలింగ్‌కు డిమాండ్ చేయడం లేదని ఆయన నిలదీశారు. అడ్డంగా రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టే టీడీపీ వాళ్లు రీపోలింగ్ అడగడంలేదని, దానివల్ల దెబ్బతిన్నారు కాబట్టి మా వాళ్లు అడుగుతున్నారు అని సజ్జల పేర్కొన్నారు. ఇప్పుడు సీఎస్ ను తొలగించాలంటూ టీడీపీ కుట్రలు చేస్తోందని సజ్జల మండిపడ్డారు. ఏది ఏమైనా జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో మరోమారు వైకాపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని, జూన్ 9వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు.