1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (20:19 IST)

పోలీసుల అదుపులో నిత్య పెళ్ళికూతురు, ఎలా మోసం చేస్తుందంటే?

ఎట్టకేలకు నిత్యపెళ్ళికూతురుని తిరుపతిలోని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి సుమారు నెలరోజుల తరువాత పోలీసులు చాకచక్యంగా ఆమెను పట్టుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న నిత్య పెళ్ళికూతురు స్నేహితురాలితో పిచ్చాపాటి మాట్లాడుతూ పోలీసులకు దొరికిపోయింది. 
 
తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి గత నెల 12వ తేదీన అలిపిరి పోలీసులకు తన భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో తన భార్య మోసం చేసిందని.. పలు పెళ్ళిళ్ళు చేసుకుని తప్పించుకుని తిరుగుతోందని అందులో వెల్లడించాడు.
 
దీంతో పోలీసులు ఆమె గురించి విచారణ చేపట్టగా రెండవ భర్త వినయ్ కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె అసలు బాగోతం బయటపడింది. తెలంగాణా రాష్ట్రానికి చెందిన వేంకటేశ్వర్లను మొదటి వివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే రెండవ పెళ్ళి తెలంగాణా రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన వినయ్‌తో జరిగింది.
 
మూడవ పెళ్ళి తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన సునీల్ కుమార్‌ను చేసుకుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు వారి నుంచి డబ్బులను తీసుకుంటూ ఉన్నట్లుండి ఇంట్లో నుంచి పరారవుతుంది. మేనమామ సహాయంతో నిత్య పెళ్లికూతురిగా అవతారమెత్తింది సుహాసిని. మూడవ భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇప్పటివరకు మూడుపెళ్ళిళ్ళు చేసుకుని 10 లక్షల రూపాయల నగదుతో పాటు 5లక్షలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలతో ఈమె ఉడాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాటిని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు సహకరించే మేనమామ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.