శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (20:43 IST)

నలుగురు పిల్లలు - భర్తను వదిలేసి 14 యేళ్ల బాలుడుతో 31 యేళ్ల మహిళ జంప్

victim
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నలుగురు పిల్లలు, భర్తను వదిలేసిన ఓ 31 యేళ్ళ వివాహిత 14 యేళ్ళ బాలుడుని తనతో లేపుకెళ్ళి సహజీవనం చేయసాగింది. వారిద్దరూ హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 31 యేళ్ల వివాహితకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈమెకు ఎదురింటిలో ఉండే 14 యేళ్ల బాలుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ బాలుడు స్థానికంగా ఓ ఇంగ్లీష్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడటంతో ఆ బాలుడు పాఠశాలకు సక్రమంగా వెళ్ళడం లేదు. 
 
దీన్ని గమనించిన తల్లిదండ్రులు బాలుడిని పలుమార్లు హెచ్చరించారు. దీంతో ఆ బాలుడు తనకు దూరమవుతున్నాడని ఆందోళన చెందిన ఆ మహిళ.. తన నలుగురు పిల్లలు, భర్తను వదిలివేసి ఆ బాలుడిని తీసుకుని హైదరాబాద్ నగరానికి వెళ్ళిపోయింది. అక్కడ బాలానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాలుడితో సహజీవనం చేయసాగింది. 
 
కొద్ది రోజుల తర్వాత ఆ బాలుడు తన తల్లిదండ్రులను చూసేందుకు గుడివాడకు వెళ్లాలని భావించాడు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో తన స్నేహితులకు మొబైల్‌లో ఓ మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్‌కు స్నేహితులెవ్వరూ స్పందించలేదు. దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 
 
అప్పటికే తమ కుమారుడు కనిపించలేదని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసివున్నారు. ఇపుడు బాలుడు నుంచే ఫోన్ రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గుడివాడ టూటౌన్ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలు బాలుడు మొబైల్ లొకేషన్ ఆధారంగా గుర్తించి వారున్న ఇంటికి వెళ్ళారు. 
 
మంగళవారం రాత్రి బాలానగర్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని బుధవారం ఉదయం గుడివాడకు తీసుకొచ్చారు. ఆ బాలుడికి వైద్య పరీక్షల తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే, వివాహితపై ఫోక్సో చట్టంతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.