శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:36 IST)

ఇంట్లో దోపిడి జరిగిందంటూ మహిళ ఫిర్యాదు... కట్ చేస్తే.. వ్యభిచారానికి అద్దె గదులు

అవన్నీ మామూలు కుటుంబాలు ఉండే అపార్ట్‌మెంట్‌లు... ఆ ఇళ్ల నడుమ ఒక వృద్ధ దంపతుల జంట... అడపాదడపా వచ్చిపోయే చుట్టాలు... ఇది మాత్రమే సాధారణ జనాలకు తెలిసిన విషయాలు... కానీ ఆ ఇంట్లో గదులను వ్యభిచారానికి గంటల లెక్కన అద్దెకి ఇస్తారని తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు.
 
అసలు విషయం ఏమిటంటే... గోరంట్లకు చెందిన ఓ మహిళ సోమవారం అర్థరాత్రి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి "సార్‌... మా ఇంట్లో ఎవరు లేని సమయంలో ముగ్గురు వచ్చి మమ్మల్ని కొట్టి 30 సవర్ల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లార"ని ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసే ముందు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించారు. అయితే, ఆ మహిళ చెబుతున్న దానికి, అక్కడ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయినా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు. 
 
గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు చెందిన ఓ అపార్ట్‌మెంట్‌లో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి వచ్చి వెళ్లిపోయారు. వాళ్లు వచ్చి వెళ్లిన సమయంలో ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఆ వృద్ధుల కుమార్తె కొద్దిసేపటికి నల్లపాడు స్టేషన్‌కు చేరి ఇంటిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసింది. 
 
కానీ, నిజానికి అక్కడ జరిగింది వేరే. ఎవరైనా వ్యభిచారం చేసుకునే వారికి ఆ వృద్ధులు గదులను గంటల లెక్కన తమ ఇంట్లోని గదులకు అద్దెకు ఇస్తుంటారు. అలా సోమవారం ఇద్దరు యువతులతో ప్రత్తిపాడుకు చెందిన ఓ యువకుడు వచ్చాడు. గదిని అద్దెకు తీసుకున్నాడు. తన పని ముగించుకుని వెళ్లే సమయంలో డబ్బులు చెల్లించలేదు. ఈ విషయాన్ని తమ కుమార్తె ఇంటికి రాగానే వృద్ధజంట చెప్పింది. 
 
దీంతో ఆగ్రహించిన ఆ యువతి.. ప్రత్తిపాడు యువకుడిపై దొంగతనం కేసు పెట్టేందుకు ఇలా ప్లాన్ చేసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో సీసీ కెమెరాలను పరిశీలించి మంగళవారం సాయంత్రం ప్రత్తిపాడుకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం చెప్పాడు. దీంతో విస్తుపోయిన పోలీసులు... వారిపై అందరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.