1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 13 మే 2020 (18:47 IST)

పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్హు శుక్లా

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను మరింత బలోపేతం చేయటం ద్వారా సగటు ప్రజలకు సైతం ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ హిమాన్హు శుక్లా తెలిపారు. జిల్లాకు నూతనంగా సంయుక్త కలెక్టర్‌గా నియమితులైన శుక్లా బుధవారం ఉదయం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా శుక్లా మాట్లాడతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందని, ఆ క్రమంలోనే నూతనంగా సంయుక్త కలెక్టర్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిందని వివరించారు.
 
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎంతో సంతోషంగా ఉందని, గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ ఇప్పటికే మంచి ఫలితాలను సాధిస్తుందని, మరింత పారదర్శకంగా పనిచేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా కృషి చేస్తానని వివరించారు. జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారాన్ని ఆశిస్తున్నానని వివరించారు. 
 
హిమాన్హు శుక్లాకు జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాసులు, డిఆర్ఓ శ్రీనివాస మూర్తి, స్వాగతం పలకగా, కలక్టరేట్ ఎఓ మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత హిమాన్హు శుక్లా జిల్లా కలెక్టర్ ముత్యాల రాజును మర్యాదపూర్వకంగా కలిసారు. కలెక్టర్ జిల్లా రూపురేఖలు, సామాజిక పరిస్థితుల గురించి శుక్లాకు వివరించారు. 
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో కరోనా పరిస్థితులు, వార్డు , గ్రామ సచివాలయాల స్థితిగతులపై వీరిరువురు చర్చించారు. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలా కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డిఓ పనబాక రచన తదితర అధికారులు పాల్గొన్నారు.