శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (12:37 IST)

మందేసిన యువతులు.. ఖాకీలకు చుక్కలు చూపించారు...

హైదరాబాద్ యువతులు పీకలవరకు మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా ఇద్దరు యువతులు పీకలవరకు మద్యం సేవించి పోలీసులకు చుక్కలు చూపించారు. శ్వాస పరీక్షలకు అంగీకరించకుండా ముప్పుతిప్పలు పెట్టారు.
 
ఆదివారం రాత్రి హైదరాబాద్‍ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిలింనగర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువతులను ఆపారు. మహిళా కానిస్టేబుల్‌ ద్వారా శ్వాసపరీక్షలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ వాహనం నడుపుతున్న యువతి సహకరించలేదు. వాగ్వాదానికి దిగింది. వెనుకాల ఉన్న యువతి వదిలేయాలంటూ పోలీసులను ప్రాధేయపడింది. చివరకు అరగంట తరువాత శ్వాస పరీక్ష నిర్వహించగా ఆమె మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది.
 
కారులో వచ్చిన మరో యువతి కూడా ఇదే విధంగా ప్రవర్తించింది. పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగింది. శ్వాస పరీక్షలకు సహకరించకపోవడంతో శాంతిభద్రతల పోలీసులు రంగంలోకి దిగి ఆమెకు పరీక్షలు చేశారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసుకొని వాహనం స్వాధీనం చేసుకున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో 112 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. వీటిలో 65 మంది ద్విచక్ర వాహనాలు నడుతున్న వారు కాగా.. ఐదుగురు ఆటో డ్రైవర్లు, కార్లు నడుపుతున్న వారు 42 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.