గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (16:40 IST)

ఇంటి అడ్వాన్స్ తిరిగి ఇవ్వమన్నందుకు యాసిడ్‌తో దాడి...

ఇల్లు ఖాళీ చేసిన తర్వాత అడ్వాన్స్ తిరిగి ఇవ్వమన్నందుకు ఆమె ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసభ్య కామెంట్‌లు చేశాడు యజమాని కొడుకు. బాధితురాలి కుమారుడు ఈ విషయం గురించి నిలదీయడానికి వెళ్తే అతని కళ్లలో కారం కొట్టారు. స్వల్ప గాఢత కలిగిన యాసిడ్‌ను కూడా శరీరంపై పోసారు. 
 
ఈ వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌ సంతోష్ నగర్‌‌లోని సర్వర్ ఖాన్ ఇంట్లో అబ్దుల్ ఫరూక్ కుటుంబం కొంతకాలంగా అద్దెకు ఉంటోంది. కొద్ది నెలల క్రితం బండి పార్కింగ్ విషయంలో సర్వర్ ఖాన్‌కి, ఫరూక్‌కి మధ్య గొడవ వచ్చింది. ఆ స్థలం వారికి కేటాయించలేదని యజమాని వారికి కఠువుగా చెప్పాడు. దాంతో గొడవ కాస్త పెద్దదైంది. 
 
ఈ నేపథ్యంలో ఫరూక్ కుటుంబం ఆ ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లో చేరారు. సర్వర్ ఖాన్ ఇంట్లో చేరేటప్పుడు వారు ఇచ్చిన అడ్వాన్స్ రూ.20 వేలు అతను తిరిగి ఇవ్వాల్సి ఉంది. దానిని తీసుకోవడానికి ఫరూక్ తల్లి కౌసర్ బేగం సర్వర్ ఇంటికి వెళ్లింది. ఏవో కారణాలు చెప్పి 5 వేలు మినహాయించి 15 వేలు మాత్రమే ఆమె చేతిలో పెట్టారు. 
 
కౌసర్ బేగం డబ్బులు లెక్కేస్తుండగా యజమాని కొడుకు ఆమె ఫోటోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసభ్య కామెంట్‌లు పెట్టాడు. ఈ విషయం తెలిసి ఫరూక్ వారిని నిలదీయడానికి వెళ్తే అతనిపై యాసిడ్‌తో దాడి చేశారు. ఇప్పుడు అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఎడమ కన్నుకు, మర్మాంగానికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. పోలీసులు హత్యాయత్నం క్రింద కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.