1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (19:46 IST)

పక్కింటి అంకులే పాడుపనికి పాల్పడ్డాడు...

హైదరాబాద్, ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో చిన్నారి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ చిన్నారి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ చిన్నారి నివసించే ఇంటికి పక్కనే ఉన్న ఇంట్లోనే దారుణ హత్యకు గురికావడం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 
 
కాగా, ఇబ్రహీంపట్నానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఆడుకోడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బాలిక తల్లి ఇంటి పక్కనే ఉన్న కాళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమె పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా పాప రాలేదు. దీంతో చుట్టుపక్కల గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ పుటేజీ కెమెరాలను పోలీసులు పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లను తనికీలు చేశారు. ఈ నేపథ్యంలో బాలిక ఉంటున్న పక్కింట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. 
 
దీంతో ఆ ఇంట్లో నివసించే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడా? లేక ఏమైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.