1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (12:59 IST)

పిల్లలు పుట్టలేదని చిత్రహింసలు.. అత్త ఎదుటే టెక్కీ కోడలు సూసైడ్

వివాహమై ఐదేళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదనీ భర్త చిత్ర హింసలు పెట్టడం, అత్త చీటిపోటీ మాటలు అనడంతో ఓ వివాహిత తన అత్త కళ్ళముందే ఆత్మహత్య చేసుకుంది.

వివాహమై ఐదేళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదనీ భర్త చిత్ర హింసలు పెట్టడం, అత్త చీటిపోటీ మాటలు అనడంతో ఓ వివాహిత తన అత్త కళ్ళముందే ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్‌లో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
చౌటుప్పల్‌ రత్నానగర్‌ కాలనీకి చెందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు దానయ్య కుమార్తె గ్రీష్మనందిని(25)ని రామంతాపూర్‌ గణేష్ నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ కుమారుడు దీపక్‌(29)కు 2013లో ఇచ్చి వివాహం చేశారు. కట్నంగా రూ.30 లక్షలు, 20 తులాల బంగారం ఇచ్చారు. వివాహం జరిగినప్పటి నుంచి గ్రీష్మనందిని మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 
 
అయితే, అదనపుకట్నం కావాలని ఆమెను భర్త వేధించాడు. దీంతో అమ్మమ్మ పాత ఇల్లు అమ్మగా వచ్చిన రూ.20 లక్షలు దీపక్‌కు ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడంలేదని భర్త, అత్తమామలు వేధించసాగారు. ఈ నేపథ్యంలో గ్రీష్మ తండ్రి దానయ్య అనారోగ్యంతో ఉద్యోగం చేయలేక ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. 
 
మామకు వచ్చిన డబ్బు కూడా ఇవ్వాలని భార్యను భర్త వేధించసాగాడు. దీనికి గ్రీష్మ అంగీకరించలేదు. దీంతో ఆమె ఉద్యోగం మాన్పించి గృహనిర్బంధం ఉంచాడు. భర్తతో పాటు అత్తమామల వేధింపులు భరించలేక అత్త సులోచన ముందే గ్రీష్మ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుంది. 
 
అదనపు కట్నం కోసం తన కుమార్తెను చంపేశారని గ్రీష్మ తల్లి ప్రేమ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి భర్త, అత్తమామలు, బావ సందీప్‌పై వరకట్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.