బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (11:48 IST)

ఇద్దరు పిల్లలతో కలిసి ప్రియుడుతో వెళ్లిపోయిన వివాహిత

చిత్తూరు జిల్లాలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహితుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ ప్రాంతానికి చాలా దూరంగా వెళ్లిపోయి సహజీవనం చేస్తున్న వారిని ఫోన్ కాల్ పట్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన రవి (35) అనే వ్యక్తి ఆ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఓ భవంతిలో నిర్మాణ పనులు చేస్తున్న వేళ, కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన మంజుల (25) అనే వివాహిత బేల్దారీ పనికి అక్కడికే వెళ్లింది. అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఆమె, రవి, ఒకరిని ఒకరు ఇష్టపడి, దగ్గరయ్యారు. హైదరాబాద్‌ను విడిచి దూరంగా వెళ్లిపోయి, బతకాలని నిర్ణయించుకున్నారు.
 
ఈ క్రమంలో తన పిల్లలను తీసుకుని రవితో కలిసి మంజుల, చిత్తూరు జిల్లాలోని అంగళ్లు అనే గ్రామానికి వచ్చి, అద్దె ఇల్లు తీసుకుని, కలసి కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించారు. మంజుల, తన పిల్లలతో సహా అదృశ్యం కావడంపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. 
 
వారి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, అంగళ్లు గ్రామంలో ఉన్నారని గుర్తించి, అక్కడికి వెళ్లి, స్థానిక పోలీసుల సాయంతో సహజీవనం చేస్తున్న జంటను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్ కు తరలించారు. కేసును విచారిస్తున్నామని, వారికి కౌన్సెలింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు.