శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:47 IST)

పైనుంచి ఒత్తిడి.. అందుకే సోదాలు : పుట్టా ఇంటి నుంచి ఒట్టి చేతులతో తిరిగెళ్లిన ఐటీ అధికారులు

పైనుంచి ఒత్తిడి వచ్చింది.. అందుకే ఇంట్లో సోదాలు చేసేందుకు వచ్చాం అంటూ చెన్నై నుంచి మైదుకూరుకు రెండు కార్లలో వెళ్లిన ఆదాయపన్ను శాఖ అధికారులు అన్నారు. ఆ తర్వాత గంటల కొద్దీ తితిదే ఛైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లోని అణువణువూ గాలించారు. చివరకు ఒట్టి చేతులతో తిరిగి వెళ్లారు. 
 
కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి తితిదే దేస్థానం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈయన ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. మూడు గంటలకు పైగా తనిఖీలు చేశారు. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు.
 
ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇంట్లో లేరు. మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. వారి సమక్షంలోనే తనిఖీలు చేశారు అధికారులు. కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. సుధాకర్ యాదవ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల క్రమంలో సోదాలు జరిగాయి.
 
ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు, వస్తువులు, నగదు లభ్యంకాకపోవడంతో ఖాళీ చేతులతో వెళ్లినట్లు సమాచారం. విషయం తెలిసి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ పుట్టా నివాసానికి చేరుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ప్రచారం చేసుకుంటున్న సమయంలో.. ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎవరు పంపించారు.. ఎందుకు పంపించారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. 
 
ఈ ఐటీ దాడులపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.