1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఆరో రోజుకు చేరుకున్న వారాహి... నేటి షెడ్యూల్ ఇదే...

pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా, ఆదివారం రాత్రి కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన కాకినాడ సిట్టింగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం కాకినాడ రూరల్ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఈ యాత్ర కొనసాగనుంది. ఏటిమొగ ప్రాంతంలో ఆయన ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. 
 
తన యాత్ర సందర్భంగా సీఎం జగన్, వైకాపా ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పవన్ కళ్యాణ్... ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వబోనని పదేపదే చెబుతున్నారు. వైకాపాను ఓడించడానికి ఎన్ని వ్యూహాలైన అమలు చేస్తామని అంటున్నారు. 
 
కాగా, సోమవారం జరిగే వారాహి యాత్రలో భాగంగా, ఉదయం 11 గంటలకు కాకినాడ రూరల్ మండల పరిధిలోని ప్రముఖులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు వీర మహిళలతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు ఏటిమొగ ప్రాంతంలో ఫీల్డ్ విజిట్ చేస్తారు. ఈ సందర్భంగా ఆయన వారాహి రథంపై ఆయన రోడ్‌షోలు నిర్వహిస్తారు. 
 
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ - అధినేత ఎవరంటే? 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఈ పార్టీని స్థాపించనున్నారు. ఇదేవిషయంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి రాజకీయ గ్రహణం పట్టింది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ మిగిలిన వర్గాలను వెనుకబాటుతనానికి గురిచేస్తున్నారని అన్నారు.
 
అన్నదాతలు వ్యవసాయాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. నైపుణ్యం కలిగిన రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చూపిస్తుంటే.. మన రాష్ట్రంలో ఉపాధి లేక అల్లాడుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ పూర్తిగా ఆణచివేస్తున్నారన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి కనుమరుగైందని, తెదేపా రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కొన్ని కుటుంబాలే లాభపడ్డాయని అన్నారు. వైకాపా ఆవిర్భావం, జగన్ అధికారంలోకి రావడం రాష్ట్ర చరిత్రలో రెండు దురదృష్టకర ఘటనలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తాత్కాలిక రాజధానితో కాలయాపన చేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 
 
ఈ పరిస్థితుల్లో మెజారిటీ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింభిస్తూ కొత్త పార్టీ ఆవిర్భవిస్తోందన్నారు. వచ్చేనెల 23న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రజాచైతన్య వేదికపై నిర్వహించే 'ప్రజా సింహగర్జన' బహిరంగ సభలో పార్టీ ఆవిర్భవిస్తుందని వెల్లడించారు.