1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (11:05 IST)

భరతమాతకు పూజలతో జనసేన ఆఫీసు ప్రారంభం.. (Video)

హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని 'జనసేన' అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కొబ్బరికాయను పవన్ కళ్యాణ్ స్వయంగా కొట్టి, ఆ తర్వాత కార్యాలయంలోకి అ

హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని 'జనసేన' అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కొబ్బరికాయను పవన్ కళ్యాణ్ స్వయంగా కొట్టి, ఆ తర్వాత కార్యాలయంలోకి అడుగుపెట్టారు. భరతమాతకు శాస్త్రోక్తంగా పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించామన్నారు. అనంతరం, కొత్త హంగులు సంతరించుకున్న కార్యాలయంలో పరిపాలనా కార్యక్రమాలను ప్రారంభించినట్టు తెలిపింది.
 
పార్టీ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పని చేస్తుందని, పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం విశాలమైన స్థలంలో హైదరాబాద్, అమరావతి నగరాలలో వేరేగా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తొలుత శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన లాంఛనాలన్నీ పూర్తయిన అనంతరం, కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసేన కార్యకర్త నిమ్మల వీరన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, విద్యారంగ ప్రముఖులు, సినీ ప్రముఖులు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ, ప్రముఖ రచయిత సత్యానంద్, ప్రముఖ హాస్యనటుడు అలీ, పవన్ కల్యాణ్ అభిమానులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు తెలుగులో రాసిన ఖురాన్‌ని నటుడు అలీ బహూకరించాడు. 
 
ఈ సందర్భంగా ఓ అభినితో పవన్ స్వయంగా సెల్ఫీ తీసుకుని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాధారణంగా తమ అభిమాన హీరోలతో అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడుతుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ‘సామాజిక, ఆర్థిక ప‌రివ‌ర్త‌న కోసం నిరంత‌రం ప‌నిచేసే, అలుపెరుగ‌ని కార్య‌క‌ర్త మా నిమ్మ‌ల వీర‌న్న‌తో..’ అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన సైనికుల సంఖ్యను పెంచుకోవడం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ అందుకోసం తమ కార్యకర్తలను కలుస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు.