గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:07 IST)

అజాత శ‌త్రువు జ‌ర్న‌లిస్టు తుర్ల‌పాటి కుటుంబ‌రావు

జ‌ర్న‌లిజంలో అంద‌రికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోయే వ్యక్తి తుర్లపాటి కుటుంబ‌రావు అని మంత్రి పేర్ని వెంకటరామయ్య కొనియాడారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, కృష్ణ కళాభారతి, తెలుగు కళావాహిని, శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు 90 వ జయంతి వేడుకలను మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాచార, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. తుర్లపాటి కుటుంబరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రపంచం అంతా గుర్తుండి పోయే వ్యక్తి తుర్లపాటి అని, ఆయన జయంతి వేడుకలలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. తన 14వ ఏటనే కలం పట్టిన మహనీయుడని, సుదీర్ఘకాలం విలేకరిగా రాణించటం ఎవరి వల్ల సాధ్యం కాదని తెలిపారు. సమాజ హితం కోసం చిన్న పత్రికల నుంచి పెద్ద పత్రికల వరకు తన మార్కును కొనసాగించాడన్నారు.

ఇటు రాజకీయాలలోను అటు సినిమాలతోను స్నేహ సంభంధాలు కొనసాగించిన మహనీయుడన్నారు. తుర్లపాటి జీవితంలో శత్రుత్వం లేని వ్యక్తి అని ఆయన అందరికి అజాత శత్రువని తెలిపారు. తుర్లపాటి భౌతికంగా దూరమయినా, ఆయన సేవలు మరో 100ఏళ్ల వరకు చరిత్రలో ఉంటాయని పేర్కొన్నారు. తుర్లపాటి సేవలు గుర్తిండిపోయేలా ప్రభుత్వంతో చర్చలు జరిపి, సముచిత స్థానం కల్పించేలా కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ, విజయవాడ అంటే ముందుగా గుర్తువచ్చేది తుర్లపాటి అని కొనియాడారు. నీతి, నిజాయితీ, స్నేహశీలి కల్గిన వ్యక్తి తుర్లపాటి అని ఆయన లేని లోటు తీరనిలోటు అని అన్నారు. ఆయన 18వేల పైగా కార్యక్రమలాలలో ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తి అని, తుర్లపాటికి సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపలు జరిపేలా కృషి చేస్తామన్నారు.

మంత్రి పేర్ని నాని చేతుల మీదుగా ప్రముఖ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మానం పొందిన వారిలో సాక్షి కౌండిన్య, విశాలాంధ్ర వెంకట రామయ్య, ఆంధ్రప్రభ హుస్సేన్, ఆంధ్రప్రభ ఎమ్.జి.కే రాజు, ఆంధ్రభూమి చలపతిరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ళనారాయణ రావు, నిర్వాహకులు చింతకాయల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.