శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (08:33 IST)

కరోనాపై అపోహలను తొలగించటంలో పాత్రికేయులు కీలకపాత్ర

కరోనా నేపధ్యంలో పాత్రికేయలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో గుర్తించిన కోవిడ్ ఆసుపత్రుల్లో పాత్రికేయులు, వారి కుటుంబాలను చేర్పించడం, వారికి సరైన వైద్య సేవలు అందే విధంగా ఆరోగ్య శాఖ ప్రతినిధి, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రతినిధులను నోడల్ అధికారులుగా నియమించామని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో పాత్రికేయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాత్రికేయలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనా నేపధ్యంలో మృతి చెందిన 8 మంది పాత్రికేయుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా కమీషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణలో ప్రతి జర్నలిస్ట్ ఒక సామాజిక డాక్టర్‌గా మారి కరోనాపై సరైన సమాచారాన్ని అందించి, ప్రజల్లో అపోహలను తొలగించేందుకు తోడ్పాడాలని పిలుపునిచ్చారు. పాత్రికేయులు విధినిర్వహణలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అలాంటి సందర్భంలో మాస్క్, శానిటైజర్ లు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

మృతదేహాల విషయంలో కూడా అనేక అపోహలు ఉన్నాయని, మృత దేహంలో 4 నుంచి 6 గంటల కన్నా వైరస్ ఉండదన్నారు. దహన సంస్కారాల అనంతరం బూడిదలో కూడా   వైరస్ ఉండదని, ఖననం ద్వారా భూగర్భ జలాలు కలుషితం అవ్వవని ప్రజలలో పాత్రికేయలు చైతన్యం తీసుకురావాలన్నారు. అందుకే రూ.54 కోట్లతో మొబైల్ విద్యుత్ దహన వాటికల కోసం ప్రత్యేక వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

కరోనా పట్ల ఎవరూ భయపడరాదని గతంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ తదితర వ్యాధులతో పోల్చుకుంటే మరణాల రేటు తక్కువని, సదరు  ఫ్లూ ద్వారా 40 శాతం  మరణాలు ఉండగా,  రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 1 శాతం అని జాతీయ స్థాయిలో రెండున్న శాతం ఉందన్నారు.  బీపీ, షుగర్ వ్యాధు గ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఇమ్యునిటీ శాతాన్ని పెంచుకోవాలన్నారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా పట్ల ప్రజలు చైతన్యంతో, అవగాహనతో ముందుకు వెళ్లే విధంగా మీడియా వాస్తవాలు అందించే విధంగా కృషి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కరోనా నియంత్రణకు ఎంతో పారదర్శకంగా పని చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 18.5 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారన్నారు.

ఒక పక్క వైద్యులు కరోనా నియంత్రణకు ముందు వరుసలో నిలబడి వైద్యం అందిస్తున్నారని వారికి మీడియా కూడా సహకారం అందించాలన్నారు. చనిపోయిన పాత్రికేయులకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచి సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పాత్రికేయ ప్రతినిధులకు సూచించారు. 

ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ పాత్రికేయులు వృత్తి పరంగా వివిధ ప్రాంతాలు తిరిగేటప్పడు మాస్క్ దరించి, తరచుగా శానిటైజ్ వాడాలని అదేవిధంగా తిరిగి ఇంటికెళ్లినప్పుడు తగిన విధంగా శానిటైజ్ చేసుకుని వెళ్లాలన్నారు. కోవిడ్ ఆసుపత్రులకు కవరేజ్ కు వెళ్లాలనుకునే పాత్రికేయులకు ఇబ్బందులు లేకుండా పీపీఈ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ముఖ్యంగా జర్నలిస్టులు ధైర్యంగా విధినిర్వహణలో తమ విధులు నిర్వహించాలన్నారు. తమ అంచనా మేరకు కరోనా మరణాలు ఎక్కువగా ఆయా వ్యక్తులలో ఉన్న కోమార్బిడ్ రోగాల వల్ల సంబవిస్తున్నాయని, సదరు దీర్ఘకాలిక రోగాలున్న వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకసారి కరోనా నుండి విడుదల పొందిన వ్యక్తులకు తిరిగి కరోనా సోకడం బహు అరుదని కాటమనేని భాస్కర్ తెలిపారు.

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమీషనర్ దృష్టికి తీసుకొచ్చిన వారిలో చందు జనార్ధన్, అంబటి ఆంజనేయులు, చావా రవి, జి.ఆంజనేయులు, ఏ.అమరయ్య, టీవీ రమణ, సాంబ‌శివరావు తదితరులు జర్నలిస్టు సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు.

వారు సూచించిన విషయాలను ముఖ్యమంత్రి ధృష్టికి తీసుకెళ్లతానని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు దాసరి శ్రీనివాసరావు, సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్‌కుమార్, కస్తూరి తేళ్ల తదితర అధికారులు పాల్గొన్నారు.