గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (09:04 IST)

శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోటాలో భారీగా కోత... శ్రీవాణి దాతలకు కేవలం వంద టిక్కెట్లు మాత్రమే..!!

venkateswara swamy
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రక్షాళన సాగుతుంది. సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇచ్చే దిశగా తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోటాను వెయ్యి కి తగ్గించారు. అదీకూడా ముందుకు వచ్చిన వారికి మాత్రమే ఈ టిక్కెట్లను జారీ చేయనున్నారు. అలాగే, శ్రీవాణి  దాతలకు మాత్రం కేవలం వంద టిక్కెట్లను మాత్రమే కేటాయిస్తారు. 
 
తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి దర్శనానికి పెరుగుతోన్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతను పెంచేందుకు వీలుగా టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టిక్కెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టిక్కెట్లను మొదట వచ్చిన వారికి ఇస్తారు. మిగిలిన 100 టిక్కెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలోనే కరెంట్ బుకింగ్ కౌంటర్లలో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయ కౌంటర్లో ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ వెల్లడించింది.