1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (14:51 IST)

వేడెక్కిన కుప్పం రాజకీయాలు : పోటాపోటీగా ప్రచారం

చిత్తురు జిల్లాలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ స్థానం టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత సెగ్మెంట్ కావడంతో రాజకీయం మరింతగా ముదిరిపాకానపడింది. ఈ స్థానంలో వైకాపా అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రులు అక్కడ తిష్టవేశారు. దీంతో ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో కుప్పం హాట్ టాపిక్‌గా మారింది. 
 
కుప్పం మున్సిపాలిటీకి నిర్వహించనున్న ఎన్నికలపై అందరి దృష్టీ నిలిచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దూకుడును మున్సిపాలిటీ పోలింగ్‌లోనూ కొనసాగించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమౌతోంది. ఆ పార్టీని నిలువరించడానికి, పట్టు నిలుపుకోవడానికీ తెలుగుదేశం మల్లగుల్లాలు పడుతోంది. ఈ రెండు పార్టీల పోటాపోటీ ప్రచారంతో కుప్పం నియోజకవర్గం వేడెక్కింది.
 
ఇప్పటికే కుప్పంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మున్సిపాలిటీపై జెండా ఎగురవేయడానికి సమాయాత్తమౌతోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో బీటలు వారిన నారా కుటుంబ కోటను కూల్చేయడానికి కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగితే.. టీడీపీకి నిలువ నీడ ఉండదనేది వైసీపీ నాయకుల అభిప్రాయం. 
 
ఇందుకోసం ఏకంగా మంత్రులు బరిలోకి దిగారు. ముఖ్యంగా, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనేందుకు వైసీపీ సీనియర్ నాయకుడు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని బరిలోకి దించింది. బద్వేలు అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీకి 90 వేలకుపైగా మెజారిటీ రావడానికి పెద్దిరెడ్డి రూపొందించిన వ్యూహాలే మళ్లీ కారణం అయ్యాయి. ఇప్పుడు కూడా కుప్పం మున్సిపల్ ఎన్నిక బాధ్యతను ఆయన స్వీకరించారు. అక్కడే మకాం వేశారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తోన్నారు.
 
మరోవైపు, కుప్పంలో పట్టు నిలుపుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బరిలోకి దిగారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. రోడ్ షోలను చేపట్టారు. చంద్రబాబు నాయుడి వారసుడిగా సుదీర్ఘవిరామం తర్వాత ఆయన కుప్పంలో పర్యటిస్తోండటం పట్ల టీడీపీ క్యాడర్‌లో జోష్ నెలకొంది. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాలేదు రాలేదు. వాటి ఫలితాలు తేడా కొట్టడంతో కనీసం మున్సిపాలిటీలోనైనా గెలుపును సాధించుకోవాలని కోరారు.