ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు
ఉపాధి కోసం పలు భాషలను నేర్చుకోవాలని, భాషతో రాజకీయాలు చేయొద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంగ్లీష్ అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే భాష మాత్రమేనని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషలో చదివి రాణించిన వారే ఎక్కువని ఆయన గుర్తు చేశారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రియల్ టైమ్ పీ-4 డాష్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను కూడా ఇందులోనే భాగస్వాములను చేశామని వెల్లడించారు. వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను తీసుకునే నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. పీ-4ను ఉగాది రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
మొత్తంగా 35 లక్షల మంది పేదరికంలో ఉంటే మొదటి దశలో 20 లక్షల మంది, రెండో దశలో 15 లక్షల మందిని పెడతామని తెలిపారు. వీరికి చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితాను కూడా సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పీ-4 కార్యక్రమం సక్రమంగా అమలు కావాలని అన్నారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు.