శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (13:49 IST)

ప్రేమను నిరాకరించిందని యువతితో పాటు ఆమె తల్లిని కూడా..?

ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కూడా దాడికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.10(సి)లోని స్రవంతినగర్‌లో నివాసముంటున్న శ్రీనివాస్‌రెడ్డి(31)అనే యువకుడు, అదే ప్రాంతంలో ఉంటున్న యువతి(26) ఇద్దరు స్థానిక ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 
 
అయితే శ్రీనివాస్‌రెడ్డి గత కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఆమె మాత్రం నిరాకరిస్తూ వస్తోంది. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఆమె ఇంటికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో యువతి ఇంటిలో లేకపోవడంతో ఆమె తల్లి సుజాతతో గొడవపడి ఆమెను గాయపరిచాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న యువతిపై కూడా శ్రీనివాస్‌రెడ్డి దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వారు భయంతో వేసిన కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకోవడంతో శ్రీనివాస్‌రెడ్డి పారిపోయాడు. గాయపడ్డ తల్లీకూతుళ్లను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.
 
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రేమించిన యువతి దక్కలేదన్న కోపంతో దాడికి దిగిన శ్రీనివాస్‌రెడ్డి శనివారం అర్ధరాత్రి అర్ధరాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాడి కేసు విషయమై గాలిస్తున్న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డి సోదరుడికి ఫోన్ చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.