1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (22:51 IST)

రుణాల చెల్లింపులపై మారటోరియం.. సుప్రీం కోర్టులో పిటిషన్‌

కరోనా నేపథ్యంలో రుణాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ చేసిన ప్రకటనపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై స్పష్టత కోరుతూ సుప్రీం ధర్మాసనం కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. తమ అభిప్రాయం తెలపాలని కేంద్రం, ఆర్‌బీఐకి సూచించింది.

ఈ ప్రకటన స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని కోరుతూ భారత స్థిరాస్తి రంగ అభివృద్ది సంస్థ (క్రిడాయ్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

క్రిడాయ్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే ఆర్‌బీఐ ప్రకటన బ్యాంకులన్నింటికీ వర్తించేదిలా ఉండగా.. కొన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాలను స్థిరాస్తి రంగానికి అందించడం లేదని తెలిపారు.

కేంద్రం తరఫున దీనికి సమాధానమిచ్చిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దీనిపై సంబంధిత విభాగాల నుంచి వివరాలు సేకరిస్తామని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.