1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (09:49 IST)

బావతో అక్రమ సంబంధం, తెలిసిందని చంపేసిన తోడల్లుడు

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత మరదలి భర్తనే కిరాతకుడు హతమార్చాడు. ఈ సంఘటన గుడిపాల మండలంలో వెలుగులోకి వచ్చింది. వెంగమాంబాపురం గ్రామానికి చెందిన బుజ్జి, ప్రభాకర్‌ భార్యాభర్తలు. అయితే, తమిళనాడులోని ఆర్కే పేటకు చెందిన తన అక్క భర్త గురుస్వామితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది.
 
దీంతో గురుస్వామి తరచూ అత్తగారింటికి వస్తూ ఇక్కడే మకాం వేశాడు. దీంతో వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రభాకర్ గుర్తించాడు. ఈ క్రమంలోనే తన భార్యను మందలించారు. దీంతో తమ సంబంధాన్ని అడ్డుకుంటున్న ప్రభాకర్‌ను హతమార్చాలని గురుస్వామి పథకం వేశాడు. ఇందుకు అదే గ్రామానికి చెందిన తిరుమల అనే వ్యక్తి సహాయం తీసుకున్నాడు.
 
దీంతో ఈ నెల 6వ తేదీ రాత్రి ప్రభాకర్‌కు మద్యం తాగించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడే హతమార్చి అడవిలోనే పూడ్చిపెట్టారు. అయితే, ప్రభాకర్ కనిపించడం లేదంటూ ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
 
దీనిపై గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గురుస్వామి, తిరుమలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ప్రభాకర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే ప్రభాకర్‌ను పాతిపెట్టిన సంఘటనా స్థలాన్ని చూపారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు.